*1. మంజీర రచయితల సంఘం ఏర్పడి దాదాపు 40 ఏళ్లు కావస్తోంది. సంఘం ఏర్పడిన నేపథ్యం గురించి, దాని ఆలోచనలు, అవగాహన గురించి చెప్తారా?*
జ. 1986 నాటికి ఉమ్మడి మెదక్ జిల్లాలో రెండు జిల్లాస్థాయి రచయితల సంఘాలు ఉండేవి. ఒకటి. మెదక్ జిల్లా రచయితల సంఘం. రెండోది. మెదక్ మండల సాహిత్య పరిషత్. రెండు సంస్థలు సంప్రదాయ సాహిత్య కేంద్రంగానే నడిచేవి. పద్య రచన, అవధానాలు, పండిత చర్చలు ప్రధానంగా సాగేవి. ఆధునిక సాహిత్యానికి జిల్లాలో వేదిక లేదు. ఎనుభై దశకములో ప్రజా చైతన్యం విస్తరిస్తున్నా ఉద్యమాలు ఎగసిపడుతున్న జిల్లా స్థాయి సాహిత్య సంస్థలు లేకపోవడం వెలితిగానే తోచింది. ఆధునిక సాహిత్య భావోద్వేగాలు ప్రజా సమూహాలకు చేరువ చేయవలసిన కొత్త సందర్భమే "మంజీరా రచయితల సంఘం" ఏర్పాటు. జిల్లాలో చెల్లాచెదురుగా ఉన్న రచయితల్ని ఏకత్రితం చేయడం, ఆధునిక సాహిత్యాన్ని విస్తృతంగా ప్రాచుర్యంలోకి తేవడం మానవ సంబంధాల్ని శాస్త్రీయంగా అర్థం చేసుకునేందుకు దోహదపడే సాహిత్యాన్ని సృజించడం ప్రధాన లక్ష్యాలుగా మంజీరా రచయితల సంఘం రూపుదిద్దుకున్నది. 1986 జూలై 20న సిద్దిపేటలో డా. సి. నారాయణరెడ్డి చేతులమీదుగా ప్రారంభించటం జరిగింది. "మానవత భావుకత మా వస్తు శిల్పాలు, జీవితపు విలువలే మా అలంకారాలు, సరికొత్త భావాల చైతన్య వేదిక" అని స్పష్టంగా ప్రకటించుకున్నాం. పాడుకున్నాం విశాల ప్రాతిపదికన పని చేయడం అలవాటు చేసుకున్నాం. కొత్త భావాలకే కాదు కొత్త రచయితల వేదికగా సాగుతున్నది.
*2. ఈ సుదీర్ఘ సాహిత్య ప్రయాణంలో మీరు దాటి వచ్చిన అనేక మైలురాళ్లు వుంటాయి. సాహిత్య రంగంలో మీ సంస్థ వేసిన ప్రత్యేక ముద్ర కూడా తప్పకుండా ఉంటుంది. ఆ విషయాల గురించి, అలాగే మీరు చేసిన కార్యక్రమాల గురించి చెప్తారా?*
జ. నలభైఏళ్ల ప్రయాణం. మంజీరా ఎన్నో మైలురాళ్లు దాటింది. నది పేరు పెట్టుకున్న ఒరవడి. మంజీరా నదికి ఏడుపాయలు. రచయితల సంఘానికి ఏడు శాఖలు. అదొక ఉత్తేజం. నది పోటెత్తినట్టే మరసానిదొక ఉద్యమం. జిల్లా స్థాయి సంస్థే అయినా తన ఆచరణతో రాష్ట్రస్థాయి గుర్తింపు తెచ్చుకున్నది. ఇప్పటి రెండు తెలుగు రాష్ట్రాల ప్రముఖ రచయితల భావోద్వేగాలు పంచుకున్నది. యువ రచయితలకు, సాహిత్య సంస్థలకు, ప్రేరణగా నిలిచింది. సంపూర్ణ మధ్యనిషేధ ఉద్యమంలో క్రియాశీలంగా పాల్గొన్నది. యాభై గ్రామాల్లో సాంస్కృతిక ప్రదర్శనలిచ్చి చైతన్యపరిచింది. 'గుట్కా' కు వ్యతిరేకంగా, అశ్లీల సంస్కృతికి వ్యతిరేకంగా, ఉన్మాదాలకు నిర్బంధాలకు వ్యతిరేకంగా, ప్రజారాశులని కూడగట్టింది మహిళా చైతన్యానికి, దళిత చైతన్యానికి చేయూత అయింది. ప్రపంచీకరణ వ్యతిరేక కవితలతో "మొగులయింది" తొలుతగా ప్రచురించింది. తెలంగాణ రాష్ట్రం కోసం తీర్మానించిన మొట్టమొదటి సాహిత్య సంస్థ మరసం తెలంగాణ పాటలతో, ప్రసంగాలతో ఉద్యమం నిర్మించింది. ముందుకొస్తున్న తెలంగాణ సందర్భాన్ని గుర్తించి మంజీరా రచయితల సంఘం పదిహేనేళ్ల ఉత్సవాలలో "తెలంగాణ రచయితల వేదిక"ను స్థాపించింది. కవుల్ని, రచయితల్ని, గాయకుల్ని, పత్రిక రచయితల్ని, వక్తల్ని, ఉద్యమ నేతల్ని తీర్చిదిద్దింది. విప్లవోద్యమం నుంచి తెలంగాణ స్వరాష్ట్ర ఉద్యమం దాకా నలభైయ్యేళ్ళ తెలంగాణ సామాజిక, సాంస్కృతిక పరిణామాల్లో మరసం పాత్ర ప్రత్యేకమైంది.
*3. మంజీరా రచయితల సంఘం పుస్తక ప్రచురణలు కూడా చేపట్టింది. ఎలాంటి పుస్తకాలు మీరు వేశారు?*
జ. 40 కి పైగా పుస్తకాలు ప్రచురించింది. కవితా సంపుటాలు, సంకలనాలు, కథా సంపుటాలు, సంకలనాలు, వ్యాస సంకలనాలు, పాటల సంకలనాలు, చరిత్ర - సంస్కృతి, భిన్న ప్రక్రియలకు సంబంధించిన పుస్తకాలు ప్రచురించింది. తెలుగులో ప్రపంచీకరణను నిరసిస్తూ మొదటి కవిత సంకలనం "మొగులైంది". తెలంగాణ కవితా సంకలనం "ఎడపాయలు". తెలంగాణ ఉద్యమంలో మొదటి పాటల సంపుటి "తెలంగాణ" ప్రచురించటం విశేషం. మెదక్ లో తొలితరం కథకుల నుంచి వర్తమాన తరం కథకుల దాకా సంకలనం చేసి యాభైరెండు కథలతో "మెతుకు కతలు" ప్రచురించింది. వట్టికోట ఆళ్వారు స్వామిని మరిచిన నేపథ్యంలో జీవితాన్ని, సాహిత్యాన్ని విశ్లేషిస్తూ "ప్రజల మనిషి వట్టికోట" పరిశోధనా వ్యాసాలు ప్రకటించింది. కిరాతకుల చేతిలో బలైన గాయని బెల్లి లలిత యాదిలో "పాటల యాది" సంకలనం, క్యాన్సర్ బారినపడి దూరమైన కవి పోగుల రాజన్న యాదిలో "సెలవింక" సంకలనం వెలువరించింది. 'భైరాన్ పల్లి పోరాట చరిత్ర', 'తెలంగాణలో శాతవాహనులు' వంటి చరిత్ర పుస్తకాలు. 'ఆధునిక వ్యవసాయానికి ఆవలి వైపు' వంటి సామాజిక విశ్లేషణలు ప్రచురించింది. ఇవేగాక మారుతున్న మాధ్యమాల్ని స్వీకరించింది. కె. శివారెడ్డి కంఠస్వరంతో "శివారెడ్డి కవిత" ప్రముఖ కవుల కంఠ స్వరాలతో "జలపాతాలు" దేశపతి శ్రీనివాస్ గానంతో "నాగేటి చాల్లల్ల" ఆడియో క్యాసెట్లు వివిధ ప్రముఖ కవుల దృశ్శీకరణతో "కవిదృశ్యం" వీడియో రూపొందించాం. ఒకటే దేశం ఒకటే భాష. ఒకటే సంస్క్రుతి అని ఏక ధ్రువ సమాజం వైపు నడిపించే నినాదాన్ని వ్యతిరేకిస్తూ మంజీర కవులు వేసిన నిరసన కవిత గానం "జోటపాటలు". మైత్రి సమావేశాలు, ప్రముఖ కవులతో ఒక రొజు, కవి సాయంత్రాలు మొదలైనవి నిర్వహించింది.
*4. మీరు ఈ సంస్థను ప్రారంభించిన కాలానికీ నేటి పరిస్థితులకు మధ్య చాలా తేడా ఉంది. అనేక రకాల ప్రసార మాధ్యమాలు పాఠకుడికి - రచయితకి మధ్యనున్న దూరాన్ని చెరిపేస్తున్నాయి. స్థానిక సాహిత్యం నుండి అంతర్జాతీయ సాహిత్యం దాకా ఇవాళ్ళ అందుబాటులోకి వచ్చింది అందరికీ. ఇలాంటి స్థితిలో ఒక సాహిత్య సంస్థ అవసరం ఉందని అనుకుంటున్నారా ? భవిష్యత్తులో మీరు ఎలాంటి కార్యక్రమాలు చేయాలని భావిస్తున్నారు?*
జ. నిజమే, మరసం ప్రారంభించిన ఎనభయ్యో దశకానికీ, ఈ ఇరువయ్యో దశకానికీ చాలా మార్పులు సంభవించాయి. పరిస్థితులు పోల్చలేనంతగా మారిపోయాయి. మాధ్యమాలు, మనస్తత్వాలు, అభిరుచులు అన్ని విధాల మారినాయి పాఠకుడికి రచయితకూ, ప్రజలకూ నడుమ తీవ్రమైన అంతరం ఏర్పడింది. అయితే- మంజీరా రచయితల సంఘం యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్, ఎక్స్, ఇంస్టాగ్రామ్, బ్లాగ్ స్పాట్ మొదలైన మాధ్యమాలలోను ప్రవేశించింది. ఈ అన్ని దశల్లో మంజీరా ప్రయాణిస్తూనే ఉన్నది గనుక- కలుపుకుంటూనే కలిసిపోతూనే ప్రవహిస్తున్నది. ప్రపంచం దగ్గరైంది. గ్రామం దూరమైంది. రెండింటి నడుమ మనుషులు తండ్లాడుతున్నారు. ఆరాటపడుతున్నారు. శ్రోత పాఠకుడయి, పాఠకుడు శ్రోతయి, కొత్తగా వీక్షకుడు అయి ఉండవచ్చు. అయినా- తడి ఆరలేదు. తపన తీరలేదు. రచయితల పని, సంస్థల పని మరింత పెరిగింది. వ్యవస్థతో పోరాట దశ అప్పుడు. వ్యక్తిగత పోరాట దశ ఇప్పుడు. మనిషి ఇంకా శిథిలమైపోయాడు. రాజకీయాలు శిథిలమైపోయాయి. రచయితలు, కవులే ప్రాణం తట్టాలి. మనిషిని ప్రతిష్టించాలి. ఆ ప్రయత్నంలో మరసం ఆపసోపాలు పడుతున్నది. ప్రాణం రేకెత్తించడానికి ప్రయాణం ఉన్న సంస్థలైనా ఏర్పడుతున్న సంస్థలైనా కొంచెం కొంచెంగానైనా కదలాలి! కదిలించాలి! విశాల ప్రాతిపదిక, విశ్వాసంతో నడక మంజీరా రచయితల సంఘం నమ్ముకున్నది. నడుస్తున్నది.
*చివరిప్రశ్న. భవిష్యత్తులో మంజీరా రచయితల సంఘం నుండి ఏ ఏ కార్యక్రమాలు చేయాలని సంకల్పించుకున్నారు?*
ఒక కథా సంకలనం, కవితా సంకలనం, వ్యాస సంకలనం వెలువరించాలని మరసం సంకల్పించుకున్నది. ఇంకా కథా కార్యశాల, కవిత్వ కార్యాశాల నిర్వహిస్తూ కొత్త కథకులకు, కవులకు ఆలంబనగా నిలవాలని ఆశిస్తున్నది. ప్రజా ఉద్యమాల్లో మమేకమవుతూ సాగాలని నిశ్చయించుకున్నది. తెలుగు పై జరుగుతున్నఅనేక రకాల వివక్షల్నీ ఎప్పటికప్పుడు నిరసిస్తూ తెలుగు భాషా సాహిత్యాల వికాసం కొసం విస్త్రుత ప్రాతిపదికన క్రుషి చేయాలనీ భావిస్థున్నది.
-విమల
No comments:
Post a Comment