20 January, 2026

మంజీర కవి పప్పుల రాజిరెడ్డి గారికి కాళోజి పురస్కారం


తెలంగాణ రచయితల సంఘం కరీంనగర్ జిల్లా శాఖ వారు అందించే ప్రతిష్టాత్మక పురస్కారం 
ప్రజా కవి కాళోజి పురస్కారాన్ని 2025 కు గాను మంజీరా రచయితల సంఘం  ప్రముఖ కవి పప్పుల రాజి రెడ్డి గారికి అందించడం పట్ల మంజీరా రచయితల సంఘ సభ్యులందరూ అభినందన వ్యక్తం చేశారు. 

జయహో పప్పుల రాజిరెడ్డి గారు 
జయహో పప్పుల రాజిరెడ్డి కవిత్వం 





*అక్షరాలతో నిప్పులు కురిపించిన పప్పుల రాజిరెడ్డి*
   - ఎ. గజేందర్ రెడ్డి

తెలంగాణ జీవితమంతటినీ నిలువెత్తుగా నింపుకున్న, తెలంగాణ తెలంగాణ భాషను శ్వాసగా నిలుపు కున్న, వ్యవస్థపై ధిక్కార స్వరాన్ని వినిపించిన కాళోజీ నారాయణరావు పేరిట ఇచ్చే అవార్డును కొత్త అనిల్ నేతృత్వంలోని తెలంగాణ రచయితల సంఘం కరీంనగర్ జిల్లా శాఖ తేది. 25.12.2025న పప్పుల రాజిరెడ్డికిచ్చి గౌరవించింది. కాళోజీ అవార్డుకు అర్హత పొందిన పప్పుల రాజిరెడ్డి కవిత్వంలోని గొప్పతనమే మిటో పరిశీలిద్దాం.

"సంకెళ్లను ఛేదించే ప్రతిఘటనా పిడికిళ్ల నినాదం మా కవిత్వం 
తెలంగాణ పల్లెల కల్లోల హృదయం మా కవిత్వం
అడవులు మా కవిత్వం 
ఆయుధాలు మా కవిత్వం 
ప్రజలు మా కవిత్వం
ప్రజావీరులు మా కవిత్వం." ఇదీ రాజిరెడ్డి కవిత్వ వరుస. 

"నా అక్ష రాల గొంతును నులిమేసినా
నా పాటల చరణాల్ని తెగ్గొట్టినా
నా పిడికిళ్ల కాంతిని నియంత్రించినా
నా పదచిత్రాల కళ్లు పెరికేసినా 
వాటిని పునర్నిర్మిస్తుం టాను". ఇదీ ఆయన ఆత్మవిశ్వాసం. 

తలలో నాలుకైన పాట 
గ్రామాల మీంచి గూడేల మీంచి
పొలాల మీంచి
కలాల మీంచి
మట్టి మీంచి పారుతుంది
పాట చావదు
నాగేటి చాలై నవ్వుతుంది. ఇదీ ఆయన ధీమా.

 "మట్టి గర్భంలోంచి మంకెన పూమొక్కలా దూసుకొస్తాను 
వ్యవస్థ గుండెలదిరేలా కల్లోల కెరటమవుతాను 
సాగర సంగీత మేళంలో రేలపాట పాడుతాను". ఇదీ ఆయన తీరు. 

ఇతడు ఉప్పెనై ఉరుమై మేఘమై మెరుపై అడివై ఆయుధమై ఏరై తల్లి వేరై నరసరాన ప్రవహించే రుధిరమై ఆ ప్రవాహంలో తేలిపోతాడు. ఇతని కవిత్వంలో ఖడ్గ హృదయంతో కరచాలనం చేస్తుంది. పక్షులు కువకువలతో స్వరచాలనం చేస్తాయి. చెమట నదుల హృదయాలు జీవనో త్సాహంతో ఉరకలెత్తుతాయి.

పాలు కారాల్సిన బుగ్గలు గొర్లు కాస్తూ బతుకు గొంగడి బుజానేసుకొని చెట్టూ పుట్టతో చెలిమి చేస్తుంటే, బలపాలు పట్టాల్సిన చేతులు బరిగె పట్టి పశువులను కాస్తుంటే తల్లడిల్లుతాడు. 
"మీ లేలేత శరీరాల కాయ కష్టాన్ని నిస్సిగ్గుగా దోచేస్తూ 
మీ కలల తలకాయల్ని తప్పదీస్తున్న ఈ పాపిష్టిలోకం క్షమార్హం కాదు" అని ఆగ్రహిస్తాడు.
పద్నాలుగేళ్లయినా నిండని పనిమని షి ఇరవై గజాల బావిలోంచి కష్టాన్ని తోడి బకెట్లలో నింపుతుంటే, అంట్లగిన్నెల సంగీతంతో బతుకు పాట నేరుస్తుంటే చూడలేక, ఆమె ఆలోచన ఎదగాలని, జీవన మూల్యాల మొగ్గ విచ్చుకోవాలని కోరుకుంటా డు. 

అణచి వేయబడుతున్న స్త్రీలనుద్దేశించి "కష్టాల ముళ్ల కిరీటాన్ని ఇంకెంతకాలం భరిస్తావు? 
అడ్డుగో డల్ని బద్దలు చేయి
స్వేచ్ఛా గాలుల జయకేతనం
ఎగురవేయి" అని సాహసాన్ని నూరిపోస్తాడు. ఇల్లు గుల్ల చేస్తున్న, కుటుంబాలను ఛిద్రం చేస్తున్న మద్యం మహమ్మారి గురించి రాస్తూ 
"మత్తు స్పర్శ లేని జగత్తు కోసం మనమంతా ఒకటవుదాం 
 బీడువడ్డ జీవితాల్లో వసంతాన్ని మొలిపిద్దాం" అని ఉద్బోధి స్తాడు.

 "అభ్యర్థి ఏ పార్టీవాడని కాదు ఏపాటివాడో చూడు" అన్నాడు కాళోజీ. అదే బాటలో “ఓటు వేసే ముందు నిజా నిజాలు తెల్సుకొని ఓ నిర్ణయానికి రావాల్సింది మనమే 
ఈ రాజ్యం మనది హక్కులు మనవి నిర్ణయాధికారం కూడా మనదే" అని ఎరుక పరుస్తాడు రాజిరెడ్డి. మగవాళ్లను గుడ్డిగా నమ్మి, ప్రేమ పేరుతో మోసపోయే ఆడవాళ్ల నుద్దేశించి 
"కత్తి లేకుండా, 
రక్తం అంటకుండా 
హంతకుడు విసిరిన యమపాశం ప్రేమ 
గాలానికి ఎర అయ్యావా 
వాని కామాగ్నికి సమిధవౌతావు" అని హెచ్చరిస్తాడు.

1980-90 దశకంలో కలం పట్టిన కవులు కొందరు అడవిబాట పట్టిన మనుషుల గురించి రాశారు. రాసిన వాళ్లలో రాజిరెడ్డి ఒకడు. ఈయన అందులోని సాధక బాధకాలనూ రాశాడు. "అడవిబాట పట్టిన వాడేమంటాడు? చెట్లల్ల కెందుకురా అంటే చెట్లే నిజాయితీ మెట్లంటాడు.
 అడివైనా వెందుకురా అంటే అడివే నా అమ్మంటాడు అడివంత పచ్చగా స్వేచ్ఛగా బతకటమే బతుకంటాడు" నిజమే కావచ్చు. కానీ వాళ్ల ఆశయం నెరవేరుతున్నదా? సమాజంలో అవినీతి అక్రమాలు అరాచకాలు తగ్గాయా? అలా కానప్పుడు నిరర్ధక త్యాగాలెందుకు? కొందరిని చంపడమెందుకు? చావడమెందుకు? వాళ్లను కన్నవాళ్ల కడుపు కోత ఎవరు తీరుస్తారు? 
"కొడుకా! మా ముద్దుల బంగారు కొండా! 
నువ్వు లేవని ఏడ్వాలా? 
బతుకీదలేక చావాలా? 
చేతకాని ఈ ముసలి పీనుగలను ఉద్దరిస్తావనుకున్నాం. 
కలో గంజో తెచ్చి కంచానశ పెడతావనుకున్నాం.
మా కళ్లముందు పిల్లాపాపల్తో సుఖంగా ఉంటావనుకున్నాం.
మా బతుకెట్ల గడవా లిరా! 
మాకు పొద్దెట్ల పోవాలిరా? 
నువ్వే చెప్పాలిరా" అని ఏడ్చేవాళ్లను ఎవరు ఓదారుస్తారు? 'వరదగూడు' కవితా సంపుటంలో ఆవేశంలో అక్షరాలతో నిప్పులు కురిపించిన పప్పుల రాజిరెడ్డి ఆనవాలు, గంగాళం కవితా సంపుటులలో ఆలోచనకు ప్రాధాన్యమిచ్చాడు. పాఠకులనూ ఆలోచనలో పడేశాడు. వర్తమాన పరిస్థితిని పరిశీలించాడు. మనుషుల తీరుతెన్నుల్ని గమనించాడు.

మనం మనుషులమేనా? మనుషులుగా మనగల్గుతు న్నామా? మనమెటు పోతున్నాం? మన తరమేమవుతుంది! మన గోతిని మనమెలా తోడుకుంటున్నాం? రక్తం తాగనేర్చిన మనుషుల్ని చూస్తున్నాం. మనిషితనం లేని డొల్ల మనుషుల సమూహం హింసే పరమావధిగా ప్రవర్ధమానమవుతున్నది. మనిషికీ మనిషికీ మధ్య వస్తు సంబంధమే రాజ్యమేలుతున్నది. కన్నతల్లి వంటి చెరువు, కల్పవృక్షం వంటి ఊరు, పాడి బర్రె వంటి వాగు ధ్వంసమవుతున్నయ్. రియల్ ఎస్టేట్ పేరిట 
"శిఖం మాయం 
 గుట్ట మాయం
 కుంట మాయం 
 తేడా వస్తే మనిషి
 మాయం".

మరి మనమేం చేయాలి? ఎవరికి తోచిన రంగాలలో మనిషి ఉద్ధరణకు, మానవతా వికాసానికి పాటు పడాలి. అందుకే పప్పుల రాజిరెడ్డి కవిత్వం రాస్తాడు. ఎవరి పేరిట రాజిరెడ్డి పురస్కారం అందుకున్నాడో, ఆ కాళోజీ గురించీ కవిత రాశాడు. అంతే కాదు. పల్లె పాటకు ప్రాణ పరిమళమద్దిన, పాటకు పాలు తాపి ఉగ్గు వెట్టి శిక్షణనిచ్చి జనబాణీలో వినిపించిన గూడ అంజయ్యను కొనియాడినాడు.

ఇంత బాగా వచన కవితలు రాసిన రాజిరెడ్డి భక్తి, దేశ భక్తి, సామాజికత నిండిన పద్యాలూ రాసినాడు. అదే 'పద్య నీరాజనం' అయింది.

మొత్తం మీద రాజిరెడ్డి కవిత్వాన్ని చదివితే, ఆయన ఏంచెప్పదలచుకున్నాడు?

"స్పందన స్పర్శా లేని మనిషి వొక మనిషేనా? 
తడీ తపనా లేని హృదయం నౌక హృదయమేనా? ప్రేమా. 
జాలీ లేని బతుకు ఒక బతుకేనా? 
ఒక మంచిమాట కోసం, 
ఒక ఆప్యాయతా పిలుపుకోసం, 
ఓ చల్లని స్పర్శ కోసం, 
ఓ చల్లనికరచాలనం కోసం బతుకుదాం". ఇదీ ఆయన కవితల సారాంశం.

 ఇంతమంచి ఆశయం కోసం కవిత్వం రాసిన రాజిరెడ్డికి అభినందనలు.

-ఎ. గజేందర్ రెడ్డి 
9848894086

06 January, 2026

రచనకు ఆయువు జీవితమే - నందిని సిధారెడ్డి

రచనకు ఆయువు జీవితమే

-నందిని సిధారెడ్డి

ఉద్రాక్ష పూలు పూసినంత సహజంగా మాటలు పూసే గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చాను. ఆరుగాలం కష్టం చేసినా సంసారం ఎల్లని వ్యవసాయ కుటుంబం మాది. ఎవరూ ఆసరా లేకపోయినా, కొట్లాడి, నిలబడి, జీవితం నిలబెట్టుకున్న బాపు, ఎత ఎవలదయినా విని, కరిగి, కన్నీరై ఒలికే అవ్వ, వెనుక దర్వాజ, ముందు దర్వాజ తెరిచి, గోసగోసగా వచ్చే మనుషుల హృదయం తెరచి కష్టసుఖాలు పంచుకుని ధైర్యం నూరిపోసే పురసంస్కృతుల చరిత్ర వంటి ఇల్లు, ఆడినన్ని ఆటలు, పాడినన్ని పాటలు, తిరిగినన్ని చెలకలు, తిన్నన్ని పండ్లు, కాయలు, తీరికలేనంత తీపిబాల్యం, ఒక్క పాండిత్యం తప్ప కవిగావటానికి ఏమేం కావాలో అవన్నీ పుష్కలంగా అల్లుకొని ఉన్న జీవ వాతావరణం నడిమి నుంచి నడిచివచ్చాను. పొద్దున లేస్తే ఏదో ఒక పాట వినిపించేది. ఎటు చూస్తే అటు ఎండినదో, పచ్చనిదో చెట్టు కనిపించేది. ఎగిరే పక్షి ఒక ప్రేరణ. పాకే పాము ఒక మెలకువ. ఒక చెరువు వందల బావులు, వేల చేన్లు, గొర్ల మందలు, పశువుల మందలు, కంచెలు, మంచెలు, రాత్రయితే భాగోతాలు, భజనలు, ఒగ్గుకథలు, శారద కథలు, కథలుకథలుగా కదిలే మనుషులు ఊరి జనం కష్టాలు చూసి రాజకీయ నాయకుణ్ణి కావాలనుకున్నాను గాని, కవినయ్యాను. తెలియక ఏదేదో కావాలనుకున్నాను. తెలిసి కలగన్నదికై కట్టింది కవిత్వమే.

జీవించడానికి ఉద్యోగం కావాలి గదా, ఎంఏ తెలుగు చేసి, పరిశోధన చేసి, డాక్టరేట్ పొంది డిగ్రీ కళాశాల ఉద్యోగం పొందాను. చేతనయినంత ఉత్సాహంతో పాఠాలు చెప్పాను. కవులుగానో, గాయకులుగానో, ఉద్యోగులుగానో, ఉద్యమకారులు గానో, నాయకులుగానో, ఎదిగిన విద్యార్థుల్ని చూసి ఆనందించాను. ఉపన్యాసాలు చేయడం ఇష్టం. ఉద్యోగ విరమణ తర్వాత సైతం ఉపన్యాసాలు ఇష్టం. హృదయాన్ని కల్లోల పరిచిన జీవితాన్ని హృదయాలను తాకే సాహిత్యంగా మలచటం ఇష్టం. మరో పనిలేదు. రచనే పని. రచనే జీవితం.

తొమ్మిదో తరగతి చదువుతున్నప్పుడు రచనకు దారి దొరికింది. తెలుగు వాచకం చదువుతుంటే పాఠాలు ఆకర్షించాయా, పద్యాలు ఆకర్షించాయా, పాటలు, కథలు ఆకర్షించాయా.. ఏవేవి ఎప్పుడెప్పుడు వెంటాడుతున్నాయో గాని అష్టకాల నరసింహ రామశర్మ "శిథిల విపంచి పద్యాలు నన్ను దారి మళ్లించాయి. సరదాకు రాజకీయాలు, సంపాదనకు రాజకీయాలు గాని సాహిత్య ప్రపంచమే సరైన దారిగా నా తత్వానికి నప్పిన దారిగా తోచింది. పద్యాలు పట్టుకున్న తర్వాత కొమురవెళ్లి మల్లికార్జునస్వామి మీద శతకం రాశాను. ఊరిమీదా, రైతు మీదా పద్యాలు రాశాను. సిద్దిపేట కళాశాలలో చేరిన తరువాత సినిమాల పిచ్చి, సినిమా పాటల పిచ్చి, సినారె ఆకర్షించాడు. మహమూద్ పాషా, భగవంతరెడ్డి, శాఖా గ్రంథాలయం, కళాశాల నవ సాహితి, కవి సమ్మేళనాలు కొత్త ప్రపంచం. కవిత్వ ప్రపంచం. లెక్క తప్పి లెక్కల నుంచి కవిత్వంలో మునిగితేలాను. "బిచ్చగాడు" అచ్చయిన మొదటి కవిత, మహమూద్ పాషా, సిద్ధారెడ్డి జంట రచన. స్థానిక "మాతృభూమి" పత్రికలో వచ్చింది. తర్వాత విప్లవ కవిత్వం వైపు చూపు. మినీ కవిత్వం అప్పటి ట్రెండ్. సాహసం చేసి కందుకూరి శ్రీరాములు, కర్ణాల బాలరాజు, సిద్ధారెడ్డి త్రిమూర్తుల "దివిటి" ప్రచురించాం. మినీ కవితా ధోరణిలో తెలుగులో మొదట వెలువడిన సంకలనం. "దివిటీ"యే. నా సాహిత్య ప్రయాణాన్ని మలుపు తిప్పిన సంవత్సరం 1974, సరిపల్లి కృష్ణారెడ్డి విప్లవ రాజకీయాలు పరిచయం చేశాడు. సూరపనేని జనార్ధనను పరిచయం చేశాడు. ఒకవైపు విప్లవ చలనాలు, మరొక వైపు సాహిత్య చలనాలు.

'భూమిస్వప్నం' నా మొదటి కవితా సంపుటి 1987 లో వచ్చింది. అది మొదలు.. సంభాషణ, ప్రాణహిత, ఒక బాధ కాదు, నది పుట్టువడి, ఇక్కడి చెట్లగాలి, నీటి మనసు ఏడు కవితా సంపుటాలు ప్రచురించాను. 'అనిమేష' కావ్యం రచించాను. 'నాగేటి సాల్లల్ల' పాటల సంపుటి వెలువడింది. 'ఇగురం' ఆవర్తనం విమర్శ వ్యాసాలు "తెలుగు కవిత్వంలో సూర్యుడు" వాస్తవికత, అధివాస్తకవిత, పరిశోధనా గ్రంథాలు, 'చిత్రకన్ను' 'బందారం కథలు' కథా సంపుటాలు.

ఇటీవల మా బాపు జీవిత కథ నేపథ్యంలో రాసిన నవల 'నాగటి తరం' చరిత్ర, సమాజం ఎట్లా గుర్తించినా సృజనకారుడికి అన్ని సాహిత్య ప్రక్రియలు సమానమే అని నా భావన. పద్యాలతో మొదలయ్యాను. వచన కవిత్వంలో స్థిరపడ్డాను. సందర్భం ఒత్తిడి చేస్తే పాటలు రాశాను. 'నాగేటి సాల్లల్ల' పాటకు చాలా గుర్తింపు వచ్చింది. "వీర తెలంగాణ” సినిమాలో జేసుదాసు పాడాడు. ఆ పాటకు 2010 ఉత్తమ సినీ గీతంగా "నంది" పురస్కారం వచ్చింది. కథలు, నవలతో పాటు నాటకం కూడా రాశాను. అనుకోకుండా నాలుగు నృత్య రూపకాలు రాశాను. ఇందిరాపరాశరం, కూచిపూడి నృత్య కళా దర్శకత్వంలో "తెలంగాణ", "అన్నదాత", దాశరథి నృత్య రూపకాలకు బాగా పేరొచ్చింది.

ఏ రచయితా పురస్కారాల కోసం రాయకపోవచ్చు. కానీ, కోరుకోవచ్చు. సృజనకు అదొక కొలమానం కావొచ్చు.

"భూమిస్వప్నం" ఫ్రీవర్స్ ఫ్రంట్ అవార్డు, దాశరథి అవార్డు అందుకున్నది. "ఒక బాధ గాదు” విశ్వ కళాపీఠం పురస్కారం అందుకున్నది. "ప్రాణహిత"కు తెలుగు విశ్వ విద్యాలయం ప్రతిభా పురస్కారం ప్రకటించదలచుకున్నప్పుడు రైతు ఆత్మహత్యల నేపథ్యంలో తిరస్కరించాను. ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం కోటి రూపాయల బహుమతి ప్రకటించదలిస్తే "తెలంగాణ తల్లి" చేతి బతుకమ్మ తొలగించిన నేపథ్యంలో తిరస్కరించాను. నచ్చిన సందర్భాల్లో కొన్ని స్వీకరించాను. తెలుగు విశ్వ విద్యాలయ విశిష్ట పురస్కారం, తేజా ఆర్ట్స్ పురస్కారం, సదాశివుడి పురస్కారం, సినారె జీవన సాఫల్య పురస్కారం, పల్లా దుర్గయ్య పురస్కారం, బి.ఎన్.సాహిత్య పురస్కారం మరికొన్ని పురస్కారాలు ఆత్మీయంగా స్వీకరించాను.

రచయిత పురస్కారాలు దాటి హృదయాల్లోకి చేరుకోవాలని భావిస్తాను. రచనను సామాజిక బాధ్యతగా భావిస్తాను. ప్రజలిచ్చే గుర్తింపే అన్నింటికంటే పెద్దది. ఏ రచయితనైనా నిలబెట్టేది ప్రజలే. ఎన్ని ప్రయోగాలు చేసినా, ఎంత శిల్ప చాతుర్యం ప్రదర్శించినా, ఎన్నెన్ని భాషల అనువాదాలు సంతరించినా రచనకు ప్రమాణం సమాజమే. రచనకు సాఫల్యత హృదయ స్పందనే. జీవితం రాయటం ద్వారానే జీవితానికి చేరువవుతాం. తమ సాహిత్యానికి ఖ్యాతి రాలేదని, సముచిత గుర్తింపు రాలేదని ఉక్రోషపడే రచయితల్ని చూస్తుంటాం. ఉక్రోషం ద్వారా గుర్తింపు రాదు. ఉత్తమ రచనతోనే గుర్తింపు వస్తుంది. ఉత్తమ రచనకు నిజాయితీ ముఖ్యం. హృదయం ముఖ్యం. ఉత్తమ రచన ఎప్పుడైనా, ఏ భాషలోనైనా జీవితం నుంచే రూపొందుతుంది. పుస్తకాలు శిల్ప నైపుణ్యానికి, రచనా నైణ్యానికి ఉపయోగపడవచ్చు.

20 July, 2025

మరసం 39వ పుట్టినరోజు శుభాకాంక్షలు. -నందిని సిధారెడ్డి గారు

మరసం 39వ  పుట్టినరోజు శుభాకాంక్షలు.
అక్షరం మీద అవ్యాజమైన ప్రేమతో ఆవిర్భవించింది మంజీరా రచయితల సంఘం. కవులమీద మమతానురాగాలతో ఏర్పడింది మరసం.ప్రజలపట్ల బాధ్యతతో బతుకుబంధంతో గళమెత్తింది మంజీరా రచయితల సంఘం. మెతుకుసీమ పరిసరాల మీద, అవసరాలమీద మట్టిబంధంతో పురివిప్పింది మరసం. సమసమాజాన్ని స్వప్నిస్తూ, చైతన్యసాహిత్యం సృష్టిస్తూ నాలుగు దశాబ్దాలుగా సాగుతున్న  ఎడతెగనినడక మరసానిది. ఉద్వేగాలలో ఉద్యమాలలో ఊగి,మాగి పాడనేర్చిన గాఢానుభవం మరసం. 
జులై 20 ,
మంజీరా రచయితల సంఘం పుట్టిన రోజు. మరసం సభ్యులకు, కవులకు,కార్యకర్తలకు,
రచయితలకు,కళాకారులకు,
అతిథులకు,ఆత్మీయులకు,పాత్రికేయులకు, ప్రజాప్రేమికులకు, శ్రేయోభిలాషులకు శుభాకాంక్షలు.

మంజీరా రచయితల సంఘం 20-07- 2025 Rare photos




“మంజీర రచయితల సంఘం”ను 1986 జూలై 20న సిద్దిపేట కేంద్రంగా స్థాపించారు. డా. నందిని సిధారెడ్డి అధ్యక్షులుగా, కె. అంజయ్య కార్యదర్శిగా ప్రారంభించారు . ఈ సంఘం ఆదునిక సాహిత్య భావాలను ప్రజాస్వామిక, సామాజిక పరిణామాల నేపథ్యంతో అనుసంధానించే లక్ష్యంతో ఏర్పడింది.


– ప్రాచీన సాహిత్యపరంపరలకు ఆధునిక సాంఘిక-వ్యక్తిత్వ దృక్పథాన్ని కల్పించి, సాహిత్యాన్ని ప్రజల మద్య చేరువ చేయడం
– యువ రచయిత, కవుల వేదికగా నిలవడం, కొత్త భావోద్వేగాలను ప్రేరేపించడం
– మద్యపానం, గుట్కా–పాన్ మసాలా వంటి సామాజిక విషమాలకు వ్యతిరేకంగా చైతన్య కార్యక్రమాలు నిర్వ‌హించటం .


సామాజిక ఉద్యమాలలో....

మద్యపాన నివారణ కోసం గ్రామీణ స్థాయిలో నాటకాలు, చైతన్య ప్రదర్శనలు

గుట్కా, పాన్ మసాలా వ్యతిరేక ప్రశ్నార్థక కవిత, పాటల ప్రచారం

రైతుల ఆత్మహత్యలపై అవగాహన కల్పించే కార్యక్రమాలు

స్వరాష్ట్ర ఉద్యమ సందర్భంలో “నాగేటి సాలల్లు” వంటి ఉద్యమ గీతాలతో ప్రేరణ


 ప్రచురణలు, పుస్తకాల్లో విస్తృతి

40కి పైగా పుస్తకాలు ప్రచురించగా, వాటిలో  సాంఘిక భావజాలం ప్రాధాన్యం:

“మొగులైంది” – ప్రపంచీకరణ నిరసన కవితా సంకలనం

“ఎడుపాయలు” – తెలంగాణ కవితాల సంపుటి

“తెలంగాణ” – పోరాట గీతాల సంకలనం

“మెతుకు కథలు” – వరుస కథకుల కథల సంకలనం

చరిత్ర, విశ్లేషణాత్మక పుస్తకాలు: “ప్రజల మనిషి వట్టికోట”, “భైరాన్‌పల్లి పోరాట చరిత్ర”

అలాగే, వారి ఆడియో క్యాసెట్లు, వీడియోలు (“కవిదృశ్యం”, “నాగేటి సాల్లల్ల”) ద్వారా భాషాభిమానులందరికీ చేరువ అయ్యారు.

జోటపాటలు - కవిత్వం


 వార్షికోత్సవాలు & సాహిత్య సభలు

– 32వ, 38వ వార్షికోత్సవాలు జన చైతన్యంగా ప్రత్యేకంగా, ప్రముఖ కవులు-వక్తలతో ఏర్పాటయ్యాయి .
– 2021లో సిద్ధిపేటలో గజ్వేల్‌లో జరిగిన సాహిత్య సభలో ప్రముఖులు, రచయితలు సంకల్ప విధానాలు పంచుకున్నారు.


డిజిటల్ – సోషల్ మీడియా ప్రాజెక్టులు

సాంప్రదాయ మాధ్యమాలతో పాటుగా, మరసం యూట్యూబ్, ఫేస్బుక్, ఎక్స్ మొదలైన వాటిలో కార్యకలాపాలను కొనసాగిస్తోంది . దీని వలన గ్రామీణ-నగర ప్రాంతాల మధ్య సాహిత్య యాజ్ఞాల అంతరాన్ని తగ్గించింది.

1. ప్రజాస్వామిక-సామాజిక చైతన్యం

 “మరసం” పాఠకుడిలో చైతన్య మేధస్సును నింపే లక్ష్యంతో పనిచేసింది.

2. స్థాయి పెంపుదల

యువ రచయితలకు వేదిక, గ్రామస్తులకు చైతన్యము, ఉద్యమ గీతాలతో సాహిత్య–ఆక్టివిజం సంబంధాన్ని మరింత బలపర్చండి.

3. బహుళ మాధ్యమ వాడకం

పుస్తకాలు, వాయిస్, వీడియోలతో మల్టిమీడియాగా మళ్లీ డిజిటల్ ప్రపంచంలో యువతను చేరుకునే ప్రయత్నం.

చరిత్ర, వ్యవహార రచనల ద్వారా ప్రజల ఆవేదనలను వ్యక్తీకరించడంతో, “మరసం” సాహిత్యాన్ని స్థూలంగా నిర్వచించింది: అది ఉద్యమ శక్తి కూడా అవుతుంది.


కొత్త కథా/కవితా/వ్యాస సంకలనాలతో సామాజిక భావాలను పరిరక్షించే
కథా, కవిత్వ కార్యశాలలు ఏర్పాటు చేసి యువ రచయితలకు శిక్షణ ఇచ్చే
భాషా పరిరక్షణలో వ్యవస్థ నిర్మాణం

ప్రజా ఉద్యమాలతో మమేకమవుతూ… Telugu భాషాభివృద్ధికి చేయూతనిస్తూ కొనసాగాలని సంకల్పించుకుంది .

మెదక్‌లోని “మరసం” వ్యూహాత్మకంగా సాహిత్యాన్ని సాంఘిక మార్పు సౌకర్యంగా మార్చి,  ప్రజాజీవనంలో శిల్పముగా నిలిచింది. ఇది తెలంగాణ ఉద్యమం, ప్రపంచీకరణ – అంతర్జాతీయ దృష్టులతో కూడిన, ప్రజాస్వామ్య-సామాజిక సాహిత్య వేదికగా పనిచేసింది.

భవిష్యత్తులో కూడా మరసం సమకాలీన సవాళ్లను అర్ధం చేసుకొని, యువతకు సృజనాత్మక శిక్షణ, ప్రజా చైతన్యం సాధన వేదికగా కొనసాగుతుంది.

#మంజీరా

29 June, 2025

ప్రముఖ రచయిత నూతి లక్ష్మణ్ గారి కి మరసం అశ్రు నివాళులు


ప్రముఖ రచయిత నూతి లక్ష్మణ్ గారి కి  అశ్రు నివాళులు...💐💐💐💐💐💐🙏🙏🙏🙏
పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం
కూనారం గ్రామంలో నూతి రాజయ్య గారి కుటుంబం అందరికీ చిరపరిచితులు ..వారి లాగిళ్లు ఒకప్పుడు ఒక కళాక్షేత్రంలా ఒక సాహిత్య క్షేత్రంలా వీలసిల్లి ఉండేది.. ఎందరో ఉపాధ్యాయులకు మేధావులకు వయసుతో సంబంధం లేకుండా ఒక అడ్డాగా నిలిచేది ..ఒక్కొక్కరు ఆ కుటుంబంలో ఒక్కొక్క వైవిధ్యం కలిగిన వారు.. స్నేహ శీలురు ప్రేమ తత్పరులు ..అందులో నూతి లక్ష్మణ్ గారు ఒక ప్రభుత్వ ఉద్యోగిగా యుక్త  వయసుకుడిగా ఉన్నప్పుడే గ్రామం నుండి పట్టణానికి వల సీకరణ చెందినవాడు.. దాంతో పాటు తాను ఉన్న ప్రాంతంలో ఒక సాహిత్య క్షేత్రం మలుచుకొని చాలామందికి చిరపరచుతుడిగా నిలిచినటువంటి వాడు.. సిద్దిపేట మెదక్ జిల్లా కేంద్రంగా చాలాకాలం మార్క్ ఫెడ్డ్ ఆఫీసర్గా పని చేస్తూ మంజీరా రచయితల సంఘం లో సభ్యుడిగా ఉంటూ పుస్తక పఠన ప్రియుడిగా తాను కొన్ని కథలు రాసి నందిని సిద్ధారెడ్డి దేశపతి శ్రీనివాస్ శివారెడ్డి  కందుకూరి శ్రీరాములు ఆశారాజు  నాలేశ్వరం శంకరం లాంటి  వారితో సరి సమానంగా నిలిచినటువంటి వాడు.. సోయి.లాంటి తెలంగాణ రచయితల వేదిక సాహిత్య పత్రికలో కథలు కూడా రాశారు.

 సౌధామిని పేరుతో ఒక రెండు కథలు రాశారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంగా కూడా మార్క్ఫెడ్ ఆఫీసులో పని చేశారు.కొన్ని విషయాలు బలాలు బలహీనతలు  మినహాయిస్తే ఆయన కాలగమనం అంత స్నేహంతో ముడిపడి ఉన్నటువంటిదే.. ప్రాంతీయ రాజకీయాల నుండి మొదలుకొని అంతర్జాతీయ రాజకీయాల వరకు చర్చలో తనదే పైచేయిగా నిలబెట్టుకునేవాడు. నాకు చిన్న వయసులోనే పెద్దవారితో సరిసమానంగా గౌరవాన్నిస్తూ నా పట్ల చాలా ప్రేమాభిమానాలతో కలిమిడిగా ఉండే స్వభావం లక్ష్మణ్ గారిది... చాలాకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాదులో చికిత్స పొందుతూ  లక్ష్మణ్ గారు ఈరోజు ఉదయం తుది శ్వాసను విడువడం జరిగింది ..

అమెరికాలో ఉన్న వారి పిల్లలు రేపు ఉదయం వరకు చేరుకుంటారు రేపు ఉదయం సిరిసిల్ల లో వారి అంత్యక్రియలు జరగనున్నాయి.. నూతి రాజయ్య గారి కుటుంబంలో అత్యంత ప్రేమ వాత్సల్యాలను పొందినటువంటి స్నేహశీలి కిషన్ గారు యుక్తవయసులోనే జరిగిపోయి ఎందరికో అప్పుడప్పుడు గుర్తుకొస్తుంటారు.. అదే ఇంట్లో నుండి మనకు లక్ష్మణ్ గారు కూడా వదిలి వెళ్లడం చాలా బాధాకరం.. లక్ష్మణ్ గారికి  ఈ సందర్భంగా వినమ్రంగ జోహార్లు అర్పిస్తూ వారి కుటుంబ సభ్యులందరికీ పేరుపేరునా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాము...


మంజీరా  రచయితల సంఘం 
సోర్స్: