తెలంగాణ రచయితల సంఘం కరీంనగర్ జిల్లా శాఖ వారు అందించే ప్రతిష్టాత్మక పురస్కారం
ప్రజా కవి కాళోజి పురస్కారాన్ని 2025 కు గాను మంజీరా రచయితల సంఘం ప్రముఖ కవి పప్పుల రాజి రెడ్డి గారికి అందించడం పట్ల మంజీరా రచయితల సంఘ సభ్యులందరూ అభినందన వ్యక్తం చేశారు.
జయహో పప్పుల రాజిరెడ్డి గారు
జయహో పప్పుల రాజిరెడ్డి కవిత్వం
*అక్షరాలతో నిప్పులు కురిపించిన పప్పుల రాజిరెడ్డి*
- ఎ. గజేందర్ రెడ్డి
తెలంగాణ జీవితమంతటినీ నిలువెత్తుగా నింపుకున్న, తెలంగాణ తెలంగాణ భాషను శ్వాసగా నిలుపు కున్న, వ్యవస్థపై ధిక్కార స్వరాన్ని వినిపించిన కాళోజీ నారాయణరావు పేరిట ఇచ్చే అవార్డును కొత్త అనిల్ నేతృత్వంలోని తెలంగాణ రచయితల సంఘం కరీంనగర్ జిల్లా శాఖ తేది. 25.12.2025న పప్పుల రాజిరెడ్డికిచ్చి గౌరవించింది. కాళోజీ అవార్డుకు అర్హత పొందిన పప్పుల రాజిరెడ్డి కవిత్వంలోని గొప్పతనమే మిటో పరిశీలిద్దాం.
"సంకెళ్లను ఛేదించే ప్రతిఘటనా పిడికిళ్ల నినాదం మా కవిత్వం
తెలంగాణ పల్లెల కల్లోల హృదయం మా కవిత్వం
అడవులు మా కవిత్వం
ఆయుధాలు మా కవిత్వం
ప్రజలు మా కవిత్వం
ప్రజావీరులు మా కవిత్వం." ఇదీ రాజిరెడ్డి కవిత్వ వరుస.
"నా అక్ష రాల గొంతును నులిమేసినా
నా పాటల చరణాల్ని తెగ్గొట్టినా
నా పిడికిళ్ల కాంతిని నియంత్రించినా
నా పదచిత్రాల కళ్లు పెరికేసినా
వాటిని పునర్నిర్మిస్తుం టాను". ఇదీ ఆయన ఆత్మవిశ్వాసం.
తలలో నాలుకైన పాట
గ్రామాల మీంచి గూడేల మీంచి
పొలాల మీంచి
కలాల మీంచి
మట్టి మీంచి పారుతుంది
పాట చావదు
నాగేటి చాలై నవ్వుతుంది. ఇదీ ఆయన ధీమా.
"మట్టి గర్భంలోంచి మంకెన పూమొక్కలా దూసుకొస్తాను
వ్యవస్థ గుండెలదిరేలా కల్లోల కెరటమవుతాను
సాగర సంగీత మేళంలో రేలపాట పాడుతాను". ఇదీ ఆయన తీరు.
ఇతడు ఉప్పెనై ఉరుమై మేఘమై మెరుపై అడివై ఆయుధమై ఏరై తల్లి వేరై నరసరాన ప్రవహించే రుధిరమై ఆ ప్రవాహంలో తేలిపోతాడు. ఇతని కవిత్వంలో ఖడ్గ హృదయంతో కరచాలనం చేస్తుంది. పక్షులు కువకువలతో స్వరచాలనం చేస్తాయి. చెమట నదుల హృదయాలు జీవనో త్సాహంతో ఉరకలెత్తుతాయి.
పాలు కారాల్సిన బుగ్గలు గొర్లు కాస్తూ బతుకు గొంగడి బుజానేసుకొని చెట్టూ పుట్టతో చెలిమి చేస్తుంటే, బలపాలు పట్టాల్సిన చేతులు బరిగె పట్టి పశువులను కాస్తుంటే తల్లడిల్లుతాడు.
"మీ లేలేత శరీరాల కాయ కష్టాన్ని నిస్సిగ్గుగా దోచేస్తూ
మీ కలల తలకాయల్ని తప్పదీస్తున్న ఈ పాపిష్టిలోకం క్షమార్హం కాదు" అని ఆగ్రహిస్తాడు.
పద్నాలుగేళ్లయినా నిండని పనిమని షి ఇరవై గజాల బావిలోంచి కష్టాన్ని తోడి బకెట్లలో నింపుతుంటే, అంట్లగిన్నెల సంగీతంతో బతుకు పాట నేరుస్తుంటే చూడలేక, ఆమె ఆలోచన ఎదగాలని, జీవన మూల్యాల మొగ్గ విచ్చుకోవాలని కోరుకుంటా డు.
అణచి వేయబడుతున్న స్త్రీలనుద్దేశించి "కష్టాల ముళ్ల కిరీటాన్ని ఇంకెంతకాలం భరిస్తావు?
అడ్డుగో డల్ని బద్దలు చేయి
స్వేచ్ఛా గాలుల జయకేతనం
ఎగురవేయి" అని సాహసాన్ని నూరిపోస్తాడు. ఇల్లు గుల్ల చేస్తున్న, కుటుంబాలను ఛిద్రం చేస్తున్న మద్యం మహమ్మారి గురించి రాస్తూ
"మత్తు స్పర్శ లేని జగత్తు కోసం మనమంతా ఒకటవుదాం
బీడువడ్డ జీవితాల్లో వసంతాన్ని మొలిపిద్దాం" అని ఉద్బోధి స్తాడు.
"అభ్యర్థి ఏ పార్టీవాడని కాదు ఏపాటివాడో చూడు" అన్నాడు కాళోజీ. అదే బాటలో “ఓటు వేసే ముందు నిజా నిజాలు తెల్సుకొని ఓ నిర్ణయానికి రావాల్సింది మనమే
ఈ రాజ్యం మనది హక్కులు మనవి నిర్ణయాధికారం కూడా మనదే" అని ఎరుక పరుస్తాడు రాజిరెడ్డి. మగవాళ్లను గుడ్డిగా నమ్మి, ప్రేమ పేరుతో మోసపోయే ఆడవాళ్ల నుద్దేశించి
"కత్తి లేకుండా,
రక్తం అంటకుండా
హంతకుడు విసిరిన యమపాశం ప్రేమ
గాలానికి ఎర అయ్యావా
వాని కామాగ్నికి సమిధవౌతావు" అని హెచ్చరిస్తాడు.
1980-90 దశకంలో కలం పట్టిన కవులు కొందరు అడవిబాట పట్టిన మనుషుల గురించి రాశారు. రాసిన వాళ్లలో రాజిరెడ్డి ఒకడు. ఈయన అందులోని సాధక బాధకాలనూ రాశాడు. "అడవిబాట పట్టిన వాడేమంటాడు? చెట్లల్ల కెందుకురా అంటే చెట్లే నిజాయితీ మెట్లంటాడు.
అడివైనా వెందుకురా అంటే అడివే నా అమ్మంటాడు అడివంత పచ్చగా స్వేచ్ఛగా బతకటమే బతుకంటాడు" నిజమే కావచ్చు. కానీ వాళ్ల ఆశయం నెరవేరుతున్నదా? సమాజంలో అవినీతి అక్రమాలు అరాచకాలు తగ్గాయా? అలా కానప్పుడు నిరర్ధక త్యాగాలెందుకు? కొందరిని చంపడమెందుకు? చావడమెందుకు? వాళ్లను కన్నవాళ్ల కడుపు కోత ఎవరు తీరుస్తారు?
"కొడుకా! మా ముద్దుల బంగారు కొండా!
నువ్వు లేవని ఏడ్వాలా?
బతుకీదలేక చావాలా?
చేతకాని ఈ ముసలి పీనుగలను ఉద్దరిస్తావనుకున్నాం.
కలో గంజో తెచ్చి కంచానశ పెడతావనుకున్నాం.
మా కళ్లముందు పిల్లాపాపల్తో సుఖంగా ఉంటావనుకున్నాం.
మా బతుకెట్ల గడవా లిరా!
మాకు పొద్దెట్ల పోవాలిరా?
నువ్వే చెప్పాలిరా" అని ఏడ్చేవాళ్లను ఎవరు ఓదారుస్తారు? 'వరదగూడు' కవితా సంపుటంలో ఆవేశంలో అక్షరాలతో నిప్పులు కురిపించిన పప్పుల రాజిరెడ్డి ఆనవాలు, గంగాళం కవితా సంపుటులలో ఆలోచనకు ప్రాధాన్యమిచ్చాడు. పాఠకులనూ ఆలోచనలో పడేశాడు. వర్తమాన పరిస్థితిని పరిశీలించాడు. మనుషుల తీరుతెన్నుల్ని గమనించాడు.
మనం మనుషులమేనా? మనుషులుగా మనగల్గుతు న్నామా? మనమెటు పోతున్నాం? మన తరమేమవుతుంది! మన గోతిని మనమెలా తోడుకుంటున్నాం? రక్తం తాగనేర్చిన మనుషుల్ని చూస్తున్నాం. మనిషితనం లేని డొల్ల మనుషుల సమూహం హింసే పరమావధిగా ప్రవర్ధమానమవుతున్నది. మనిషికీ మనిషికీ మధ్య వస్తు సంబంధమే రాజ్యమేలుతున్నది. కన్నతల్లి వంటి చెరువు, కల్పవృక్షం వంటి ఊరు, పాడి బర్రె వంటి వాగు ధ్వంసమవుతున్నయ్. రియల్ ఎస్టేట్ పేరిట
"శిఖం మాయం
గుట్ట మాయం
కుంట మాయం
తేడా వస్తే మనిషి
మాయం".
మరి మనమేం చేయాలి? ఎవరికి తోచిన రంగాలలో మనిషి ఉద్ధరణకు, మానవతా వికాసానికి పాటు పడాలి. అందుకే పప్పుల రాజిరెడ్డి కవిత్వం రాస్తాడు. ఎవరి పేరిట రాజిరెడ్డి పురస్కారం అందుకున్నాడో, ఆ కాళోజీ గురించీ కవిత రాశాడు. అంతే కాదు. పల్లె పాటకు ప్రాణ పరిమళమద్దిన, పాటకు పాలు తాపి ఉగ్గు వెట్టి శిక్షణనిచ్చి జనబాణీలో వినిపించిన గూడ అంజయ్యను కొనియాడినాడు.
ఇంత బాగా వచన కవితలు రాసిన రాజిరెడ్డి భక్తి, దేశ భక్తి, సామాజికత నిండిన పద్యాలూ రాసినాడు. అదే 'పద్య నీరాజనం' అయింది.
మొత్తం మీద రాజిరెడ్డి కవిత్వాన్ని చదివితే, ఆయన ఏంచెప్పదలచుకున్నాడు?
"స్పందన స్పర్శా లేని మనిషి వొక మనిషేనా?
తడీ తపనా లేని హృదయం నౌక హృదయమేనా? ప్రేమా.
జాలీ లేని బతుకు ఒక బతుకేనా?
ఒక మంచిమాట కోసం,
ఒక ఆప్యాయతా పిలుపుకోసం,
ఓ చల్లని స్పర్శ కోసం,
ఓ చల్లనికరచాలనం కోసం బతుకుదాం". ఇదీ ఆయన కవితల సారాంశం.
ఇంతమంచి ఆశయం కోసం కవిత్వం రాసిన రాజిరెడ్డికి అభినందనలు.
-ఎ. గజేందర్ రెడ్డి
9848894086
No comments:
Post a Comment